తుకాలు పోస్తున్న రైతులు
వానాకాలం ‘సాగు’తున్నారు
సిరిసిల్ల: రోహిణీ కార్తె నేడు(సోమవారం) ప్రవేశిస్తుంది. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్కు శ్రీకారం చుడుతున్నారు. మొన్నటి వరకు ఎండలు మండిపోవడంతో ధాన్యం అమ్ముకునే పనుల్లో నిమగ్నమైన రైతులు ఇప్పుడు వానాకాలం సాగుకు తుకం(నారు మడి) పోస్తున్నారు. రోహిణీ కార్తెలో తుకం పోస్తే బలమైన పంట పండుతుందనే నమ్మకంలో రైతులు సన్నరకం వడ్లను తుకాలు పోస్తున్నారు. జిల్లాలో 2,48,507 ఎకరాల్లో అన్ని పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్క వరి పంటనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,91,366 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి పంటను 47,120 ఎకరాల్లో సాగు చేస్తుండగా.. ఇతర పంటలు 10,021 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు పనులు ప్రారంభించారు. రోహిణీ, మృగశిర కార్తెల్లో వర్షాలు ప్రారంభమైతే.. అపరాల సాగు, జీలుగు సాగు పెరగనుంది.


