● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: యువతకు ఉపాధి కల్పనే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కే–కన్వెన్షన్ హాల్లో శనివారం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన మెగా జాబ్మేళాలో ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేర్వేరుగా పాల్గొని మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్లోనూ మరిన్ని ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని ఆది శ్రీనివాస్ వివరించారు. 30 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి నియామకపత్రాలను అందించారు.
ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి: కలెక్టర్
యువత ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. పోటీ ప్రపంచంలో చదువు ఒక్కటే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకుంటేనే రాణిస్తారన్నారు. ప్రభుత్వశాఖల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. సాధించేందుకు శ్రమించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, ఎల్డీఎం మల్లికార్జున్రావు, యువజన క్రీడల అధికారి రాందాస్, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, తహసీల్దార్ మహేశ్రావు, మైనార్టీ సంక్షేమాధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, నాయకులు గడ్డం నర్సయ్య, చొప్పదండి ప్రకాశ్, బొప్ప దేవయ్య, బండ నర్సయ్యయాదవ్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


