‘కేసీఆర్‌ను టచ్‌ చేస్తే దేశం అగ్నిగుండం అవుతుంది’

TRS MLA Jeevan Reddy Slams On BJP Leaders Hyderabad - Sakshi

ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణతో పాటు దేశం అగ్నిగుండం అవుతుందని పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాము ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని, అవసరమైతే సీఎం కూడా ప్రచారం చేస్తారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ బీజేపీ పార్టీని సర్కస్‌ కంపెనీగా మార్చి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ షో నిర్వహిస్తున్నాడని అన్నారు.

చదవండి: జట్టు కట్టి.. బీజేపీ కట్టడి..

వార్డు మెంబర్‌గా కూడా గెలవని ఆ పార్టీ నేత మురళీధర్‌రావు కాళేశ్వరంలో అవినీతి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దొడ్డిదారిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని, అసోం సీఎం హేమంత్‌ బిశ్వ శర్మ తప్పుడు ప్రచారాలను గతంలోనే ఫేస్‌బుక్‌ బ్యాన్‌ చేసిందని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ మహబూబ్‌నగర్‌ సభకు ముఖం చాటేశారన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top