● ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా శాఖ హెచ్చరిక
● రెండో రోజు కొనసాగిన గేట్ మీటింగ్
విజయనగరం అర్బన్: ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీ హెచ్చరించారు. జోనల్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని డిపోల కార్యాలయాల ఎదుట రెండో రోజు శుక్రవారం కూడా కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక విజయనగరం డిపో ఎదుట నిర్వహించిన గేట్ మీటింగ్లో పలువురు మాట్లాడారు. గత ఆరు నెలలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి పలుమార్లు మెమోరాండం ఇచ్చినప్పటికీ సరైన స్పందన లేకపోవడం వల్లే తాము ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్లను సైతం ఈ జోన్లో అమలు చేయకపోవడం విచారకరమన్నారు.
సీ్త్ర శక్తి పథకంతో విపరీతమైన ఒత్తిడి
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీ్త్ర శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. 50 మంది ఎక్కవలసిన బస్సులో 150 మంది వరకు ఎక్కుతున్నారని దీనికి తోడు టికెట్లు జారీ చేసే టిమ్లు సరిగా పని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొత్తం 26 డిమాండ్లతో కూడిన నోటీసులు యాజమాన్యానికి అందించామని తెలిపారు. డిమాండ్లలో షెడ్యూళ్లను ‘మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్’ చట్టం ప్రకారం రూపొందించాలి. డిపోల మేనేజర్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను, ఇతర యూనియన్లకు అనుకూలంగా వ్యవహరించే విధానాలను విడనాడాలన్నారు. జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోనల్ సహాయ కార్యదర్శి డీఎస్రావు, జోనల్ కమిటీ సభ్యులు బి.రామారావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్డీ ప్రసాద్, డిపో ముఖ్య కార్యదకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.


