చినగంజాం: వాన్పిక్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయిన దృష్ట్యా భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని.. వాటిని పొందేంత వరకు తమ పోరాటం ఆగదని చీరాల మాజీ శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, మండలంలోని 13 గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మోటుపల్లి పంచాయతీ అడివీధిపాలెం గ్రామంలో వాన్పిక్ భూముల 13 గ్రామాల రైతులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెదప్రోలు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. వాన్పిక్కు సంబంధించి విదేశీ కంపెనీ రసల్ఖైమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం ఆపి వేసి వెనక్కు వెళ్లిన దృష్ట్యా ప్రభుత్వం తమకు సంబంధించిన భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని వారు సమావేశంలో కోరారు. రైతుల న్యాయపరమైన డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని భూములను రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో న్యాయపరమైన హక్కులు సాధించుకునేందుకు చట్టపరమైన పోరాటం సాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పండ్రాజు శంకర్రావు, 13 గ్రామాల పెద్దలు, కాపులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


