వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపులో భాగంగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం అయిందని పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ పార్టీ పిలుపులో భాగంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే ఈ విధంగా వ్యతిరేకత రావడం చరిత్రలోనే మొదటిసారి అన్నారు. ఎన్నడూ ఈ విధంగా తక్కువ కాలంలోనే వ్యతిరేకత సంపాదించుకున్న కూటమిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రానున్న కాలంలో కూడా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలను ప్రశ్నించేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రావాలన్నారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలకు పిన్నెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం మూటగట్టుకుంటుందన్నారు.
దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్కు చెందిన కె.గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు.


