రొంపిచర్ల: రొంపిచర్లలో గల ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ఇంట్లో నాలుగు లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన బడిగుంచాల విజయ్కుమార్ రెండు సంవత్సరాల కిందట గ్రామానికి వచ్చి స్థానిక హైవే రోడ్డు సమీపంలో సాయిబాబా ఆలయం పక్కన గల స్థలాన్ని అద్దెకు తీసుకుని ఇల్లు నిర్మించుకుని, వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో తన స్వగ్రామానికి వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు ఇంటి తాళం పగులగొట్టి, రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి, లోపల బీరువాను పలుగుతో పగులగొట్టి, అందులో ఉన్న లక్ష రూపాయలు నగదు, మూడున్నర సవర్ల బంగారం తీసుకెళ్లారు. తన స్వగ్రామం నుంచి ఇంటికి వచ్చిన విజయ్కుమార్ ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లో బీరువా తెరిచి, వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. తన ఇంట్లో జరిగిన దొంగతనంలో మూడున్నర సవర్ల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువకల సొత్తు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు, క్లూస్ టీం సభ్యులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిత్యం జన సంచారం, సమీపంలో హైవే రోడ్డు పై ఎప్పుడూ వాహనాల తిరిగే ప్రదేశంలో దొంగతనం జరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.
మూడున్నర సవర్ల బంగారం, రూ.లక్ష నగదు మాయం


