జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మొత్తం 484 అదనపు తరగతి గదులు, 55 టాయిలెట్ల నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 218 అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉందన్నారు. ఇప్పటికే పూర్తయిన తరగతి గదులకు విద్యాశాఖ వద్ద అదనంగా ఉన్న ఫర్నీచర్ను ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేయాలన్నారు. వీటికి తోడు 23 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏయే పాఠశాలలో నిర్మాణాలు ఏయే తేదీలోగా పూర్తి చేస్తారో టైమ్లైన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన తరగతి గదులకు ఎప్పటికపుడు ప్రజాప్రతినిథులతో ప్రారంభోత్సవం చేయించాలన్నారు. డీఈవో రామారావు, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్ (మున్సిపల్), గ్రామీణ నీటి సరఫరా, సమగ్ర శిక్ష, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయండి
జిల్లాలో చిలకలూరిపేట–నకరికల్లు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167ఏ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టరును జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జాతీయ రహదారులు 544డి, 167ఏ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తీర్ణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నకరికల్లు–ఓడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణ కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు.
రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలి
రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ నెల 15న పెరేడ్ గ్రౌండ్స్లో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం, నిర్వహణపై అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం‘ పేరుతో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాస్థాయిలో వేడుకల కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిదులు పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మహిళలను ఈనెల 15న సన్మానించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ అద్దెయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


