– శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి
నరసరావుపేట రూరల్: దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా సిమెంట్ అందజేస్తున్నట్టు శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి తెలిపారు. పట్టణంలోని హెచ్–6 హోటల్లో శుక్రవారం దాచేపల్లి శ్రీ సిమెంట్ ప్లాంట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ జీఎంలు శ్రీనివాస్, శ్రీధర్ రాజు, ఏజీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు శ్రీ సిమెంట్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ నమాన్ పేరుతో వీరమరణం పొందిన అమరవీరుల కుటుంబాల వారసులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అమరవీరుల కుటుంబం తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు అవసరమైన సిమెంట్ను పూర్తిగా ఉచితంగా సరఫరా చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలు దేశంలోని శ్రీ సిమెంట్ ప్లాంట్ల నుంచి సిమెంట్ను సేకరించవచ్చని స్పష్టం చేశారు. ప్లాంట్ జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దాచేపల్లి ప్లాంట్లో 180 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యధిక శాతం స్ధానికులకే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక వసతుల కల్పన, విద్యా వలంటీటర్ల నియామకం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.


