మొరాయించిన రైల్వేగేటు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కొత్తూరు నుంచి పాతూరు వెళ్లే మార్గంలో కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలో ఉన్న రైల్వేగేటు మంగళవారం మొరాయించింది. గేటు వద్ద పనిచేసే సిబ్బంది ఆ రైల్వేగేటును తరచూ పైకి లేపి వాహనాల రాకపోకలకు అనుమతించారు. మంగళవారం ఉదయం నుంచి గేటు పైకి ఎత్తే సమయంలో ఒకవైపు గేటుకు ఉన్న లాక్ ఓపెన్ కాక మొరాయించింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైల్వేగేటు మొరాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గేటు వేసిన ప్రతిసారి సిబ్బంది ఆ లాక్ను తప్పించి గేటును ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 6 గంటలకు రైల్వే గేటుకు మరమ్మతులు నిర్వహించారు.
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఒకటవ స్థాయీ సంఘ సమావేశాన్ని ఈనెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదే రోజు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు మూడు జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులకు సమాచారాన్ని పంపారు. కాగా ఈనెల 7వ తేదీన జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో భాగంగా ప్రణాళిక–ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒకటో స్థాయీ సంఘ సమావేశాన్ని సభ్యులు బహిష్కరించిన విషయం విదితమే. ఈనెల 7వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించడంతో ప్రణాళిక–ఆర్థిక అంశాలకు సంబంధించిన అజెండాను సమావేశంలో ప్రవేశపెట్టాలంటే, ముందుగా ఆయా అంశాలు స్థాయీ సంఘం ఆమోదించాల్సి ఉంది. ఇందు కోసం శనివారం ఉదయం 9.30 నుంచి స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించి, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు.
మెడికల్ ఎగ్జిబిషన్
22 వరకు పొడిగింపు
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కళాశాలలో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్ను ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. కాలేజీ విభాగాధిపతుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 38,120 మంది మెడికల్ ఎగ్జిబిషన్ను సందర్శించినట్లు వెల్లడించారు. ప్రజలు, పాఠశాలల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, విభాగాధిపతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎగ్జిబిషన్ను పొడిగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే జర్నలిస్టులకు, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల పరిధిలో పనిచేసే ఫీల్డ్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, ట్రాఫిక్ పోలీసులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత ప్రవేశం పొందదలచిన వారు తమ అధికారిక గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుంటూరు మెడికల్ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
గుంటూరు డీఎంహెచ్ఓగా డాక్టర్ వెంకటేశ్వర్లు
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్గా డాక్టర్ టి.వెంకటేశ్వర్లును నియమిస్తూ హెల్త్ సెక్రటరీ సౌరబ్ గౌరవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు డీఎంహెచ్గా పనిచేస్తున్న డాక్టర్ కొర్రా విజయలక్ష్మిని డైరెక్టర్ ఆఫ్హెల్త్ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరులో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పనిచేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు 2024 డిసెంబరు 25 నుంచి ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓగా పనిచేస్తున్నారు.
మొరాయించిన రైల్వేగేటు
మొరాయించిన రైల్వేగేటు
మొరాయించిన రైల్వేగేటు


