ఖలీల్వాడి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామని చేసిన ప్రకటనను సీఎం వెనక్కి తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల అధికారిగా సోమయ్య హాజరై మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఒక్క పాఠశాలను కూడా మూసివేయనని, బడ్జెట్లో విద్యారంగాని 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ విద్యారంగాన్ని, ఫీజులను నియంత్రిస్తామని, ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొని ఇప్పుడు తిరోగమన విధానాన్ని ప్రకటించడం సరికాదన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఓమాజీ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించారు. జిల్లా కమిటీ సభ్యులు. విజయ్కుమార్, పి దాసు ఆర్ పెంటన్న, అరుణ్కుమార్, ఆయా మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


