● అధికారులకు జిల్లా కలెక్టర్
ఇలా త్రిపాఠి ఆదేశాలు
నిజామాబాద్ అర్బన్: ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా, ఇతర ఎరువుల పంపిణీ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. క్రాప్ బుకింగ్ కలిగిన రైతులకే పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన భూముల్లోని పంటలకు క్రాప్ బుకింగ్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో అంగన్వాడి భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అనువైన స్థలాలను త్వరితంగా కేటాయించాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) అమలుకు సంబంధించి బీఎల్వోలు, బీఎల్ఏలకు ఆయా విడతలలో అందించనున్న శిక్షణ కార్యక్రమాలలో సహాయ ఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


