● ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో వరి సాగు చేస్తున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యాసంగి వరి కోతలు ఎప్పుడో పూర్తయి, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుని లాభాలు చేతికి అందుకున్నారు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతూ ఇప్పటికే నారుమడులు పోసుకుని దుక్కులు దున్నుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే డొంకేశ్వర్ మండలం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పరివాహక గ్రామాల రైతులు ఇంకా యాసంగి సాగులోనే ఉన్నారు. వర్షాకాలంలో వరదలొచ్చి ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మండలంలోని పలు గ్రామాల రైతుల భూములు సుదీర్ఘకాలం పాటు నీటి ముంపులోనే ఉండిపోతాయి. వేసవిలో ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ ఒకొక్కక్కటిగా బయటపడతాయి. నీరు పూర్తిగా వెనక్కి తగ్గిన తర్వాతే రైతులు భూములను సాగు సిద్ధం చేసుకుంటారు. ఈ ఏడాది కూడా యాసంగి వరినాట్లను రెండు నెలలు ఆలస్యంగా వేశారు. ఫలితంగా పంటలు ఇప్పుడిప్పుడే ఎదిగి పొట్ట దశకు వస్తున్నాయి. వీటిని కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.


