● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శ్రమదానం
సుభాష్నగర్: ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక చొర వతో సోమవారం నగరంలోని 41వ డివిజన్ వసంత్ నగర్లో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్తోపాటు నగర మేయర్ కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఖాళీ స్థలాన్ని శ్రమదానంతో శుభ్రంచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో శ్రమదానం అంశం లేనప్పటికీ, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చే యాలనే లక్ష్యంతో నగరంలో ప్రత్యేకంగా శ్రమదా నం కారక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఖాళీస్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవాలని, తద్వారా ఆ స్థలాలను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కులు, వాకింగ్ ట్రాక్ తదితర వాటి కోసం వినియోగించుకునేలా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రస్తుతం శ్రమదానం చేసిన సుమారు 10వేల చదరపు గజాల మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించేందుకు సరిహద్దులను గుర్తిస్తూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆహ్లాదాన్ని అందించేలా పూల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ పూజిత, స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


