సుభాష్నగర్ : జీజీహెచ్ నిజామాబాద్లో తొలిసారి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ విజయవంతమైంది. కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో తొలిసారిగా నిర్వహించిన క్లిష్టమైన వైద్య, శస్త్రచికిత్సా ప్రక్రియలు విజయవంతమై ఆస్పత్రి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్రావ్ తెలిపిన వివరాల ప్రకారం... బురాజీ (65) అనే వ్యక్తి ఇటీవల తీవ్రమైన ఛాతినొప్పితో జీజీహెచ్లో చేరారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రక్షన్(గుండెపోటు) వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే కార్డియాలజీ బృందం థ్రాంబోలైసిస్ చేసి రోగికి చికిత్స అందించారు. గురువారం రోగికి యాంజియోగ్రామ్లో రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించి కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్ బృందం పీటీసీఏ స్టెంట్ వేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు కార్డియాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తున్న సహకారంతోనే అత్యాధునిక వైద్య సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి విజయ్ కుమార్ నాయకత్వాన్ని, ప్లాస్టిక్ సర్జన్ శివానీ సేవలను వారు ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
● జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్
నిజామాబాద్ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ పేర్కొన్నారు. మండలంలోని మల్లారం (ఎం), గాంధీనగర్ గ్రామ శివారులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి, స్వచ్ఛంద సంస్థలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


