సాక్షి, న్యూఢిల్లీ: మేజర్లు అయిన వ్యక్తులు పెళ్లి కాకుండా స్వచ్ఛందంగా సహజీవనం చేసి, బిడ్డను కని, విడిపోయిన తరువాత అత్యాచారం, దోపిడీ అని ఆరోపించడం సరికాదంటూ సుప్రీకోర్టు తేల్చి చేసింది. ఈ కేసు విచారణ సంబంధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
వివాహ బంధం లేకుండా కేవలం ఇద్దరు స్త్రీపురుషులు సహజీవనం నుండి బయటకు రావడం (బ్రేక్ అప్) అనేది నేరం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకోకుండా కలిసి ఉండటం వల్ల కలిగే నష్టాలను కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడి, ఆపై మోసం చేశాడని ఒక మహిళ ఒక వ్యక్తిపై పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.
పరస్పర అంగీకారంతో కూడిన సహజీవన సంబంధాలకు, నేరపూరిత లైంగిక నేరాలకు మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ, వివాహేతర సంబంధాలలో వయోజనులు స్వచ్ఛందంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్న ప్పుడు, అటువంటి సంబంధాలలో సహజంగానే ప్రమాదాలు ఉంటాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. వివాహం చేసుకోకుండానే, సహజీవనం చేసి బిడ్డను కని, ఇప్పుడు అత్యాచారం, దాడి అంటూ ఆరోపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పరస్పర అంగీకారంతో కలిసి ఉన్న తర్వాత, ఆ బంధం విడిపోతే దాన్ని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ బంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


