అహ్మదాబాద్లోని వత్వా (Vatva) ప్రాంతంలో ఒక పాత "దెయ్యాల కొంప" (Haunted House) రహస్యం వెల్లడైంది. 32 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణ హత్యను, క్షుద్రపూజలు గుట్టును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 1992 నాటి హత్యతో సంబంధం ఉన్న ఒక దెయ్యాల కొంపలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో మిస్టరీ వీడింది.
దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఫర్జానా రాధన్పురి (40) ఆస్తి వివాదం కారణంగా 1992లో హత్యకు గురయ్యారు. ముఖ్యంగా తన ప్రియుడు షంసుద్దీన్ ఖేడావాలా ఆస్తిలో సమాన వాటా కావాలని ఆమె కోరడంతో వివాదం మొదలైంది. 1992లో జూలై లేదా ఆగస్టు నెలలో ఒక వర్షం కురిసిన రాత్రి, షంసుద్దీన్ తన సోదరుడు ఇక్బాల్, మరో అనుచరుడు అబ్దుల్ జవ్రావాలా సహాయంతో ఫర్జానాను గొంతు నులిమి చంపేశాడు. వాట్వాకు చెందిన అబ్దుల్ జవ్రావాలా ఆమె చేతులను పట్టుకోగా, కుతుబ్నగర్లోని మరో సహచరురాలైన షాలియాబీవి పఠాన్ ఇంట్లో జరిగినట్లు సమాచారం. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ను తవ్వించి, ఆమె మృతదేహాన్ని అందులో వేసి మట్టి, ఇసుక, సిమెంట్తో పూడ్చిపెట్టారు.
ఇక్కడితో కథ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. నిందితులను అపరాధభావం, భయం వెంటాడుతూ వచ్చాయి. దీనికి తోడు వరుస మరణాలతోఫర్జానా ఆత్మ తిరుగుతోందనే భయం నిందితుల్లో మొదలైంది.
ముఖ్య నిందితుడు షంసుద్దీన్ 2015లో గుండెపోటుతో మరణించగా, మిగిలిన నిందితులు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో వణకు మొదలైంది. ఆమె శాపం వల్లే వీరంతా చనిపోతున్నారని కుటుంబ సభ్యులు, ఇతరులు నమ్మారు. ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజల్ని ఆశ్రయించారు. చివరికి ఆ ఇల్లు ఖాళీ అయిపోవడంతో ఆ ఇంటిని స్థానికులు "భూత్ బంగ్లా" అని పిలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
నిందితుడి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన పరిణామమనని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మృతురాలి గురించి పదేపదే ఏవేవో భ్రాంతులు రావడంతో, వారిలో తీవ్ర భయాందోళనలకు, మానసిక క్షోభకు దారితీసింది. దీన్నుంచి ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!
పోలీసుల ఎంట్రీ
ఆత్మ శాంతి కోసం నిందితుల కుటుంబ సభ్యులు ఈఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే సమాచారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా, పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. 1992లో అక్కడ ఒక హత్య జరిగిందని, ఆ పాపం కడుక్కోవడానికే వారు ఈ పూజలు చేస్తున్నారని ఇన్ఫార్మర్ల ద్వారా నిర్ధారించు కున్నారు. బుధవారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ బృందం ఆ పాడుబడిన ఇంటిపై దాడి చేసి, అనుమానిత స్థలంలో తవ్వకాలు చేపట్టింది. సాయంత్రానికి సుమారు 5-6 పళ్ళు, 7-8 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఫర్జానావేనని భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!


