నారాయణపేట: త్రైమాసిన తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సీల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించారు. గోదాంలో సీసీ కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు పనిచేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆరా తీశారు. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. అదేవిధంగా గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది హాజరు, భద్రత రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలు, డ్యూటీ మార్పిడి ప్రక్రియలను పరిశీలించారు. అనుమతి లేని వ్యక్తులు గోదాంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ జయసుధ, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, పుర కమిషనర్ శంకర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.


