బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. పెళ్లి పేరుతో తన కుమారుడిని రూ. 9.35 కోట్ల వరకు మోసం చేసిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టును అషురెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.
ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు.


