మంచిర్యాలరూరల్(హాజీపూర్): అధికారం కోసమే బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని, ఇందులో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేంపల్లిలో పద్మావతి గార్డెన్స్లో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి మాట్లాడారు. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఇప్పటికే బీజేపీ భారీ ఓట్లను తొలగించిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల తొలగించేందుకు చేస్తున్న కుట్రతో పౌరసత్వానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో ఓటరు నమోదు సవరణకు బీజేపీ తీసుకువచ్చిన ది ఎలక్షన్ లాస్(అమెండ్మెంట్) బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సర్తో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎమ్మెల్యేల సంక్షిప్త సమాచారాన్ని సేకరించి ఏఐతో క్రోడీకరిస్తూ అనుకూల ఓటర్లను తొలగించే యత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే మ్యాపింగ్తో 2 లక్షల వరకు, అన్ మ్యాపింగ్తో 85 వేల వరకు ఓట్ల తొలగింపు చర్యలకు సిద్ధం కాగా, ఓటు కోసం తగిన ఆధారాలు చూపించాల్సి ందేనని ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఏలు తక్కువ సంఖ్యలో హా జరుకావడంపై ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సీరియస్ అయ్యారు. ఇష్టం లేని వాళ్లు ముందుగా సమాచారం ఇస్తే వారిస్థానంలో మరొకరికి బీఎల్ఏగా అవకాశం ఇస్తామన్నారు. సర్ పేరిట తెలంగాణలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సభ్యత్వ నమోదు పార్లమెంట్ ఇన్చార్జి రహమత్ హుస్సేన్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్రావు, శిక్షకుడు అవేజ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నర్సయ్య, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


