శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల నడ్డి విరిచేలా తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను అడ్డుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శనివా రం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలు గు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు కట్టు బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని, వీటిని పోరాటాలతోనే తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ఇతర నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యా, వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ కొరకు కఠిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శిగా బోడంకి చందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు కనికరపు అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ.ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ప్రకాష్, చందు, అశోక్, పున్నం నాయకులు దుంపల రంజిత్ కుమార్, ప్రేంకుమార్, ఉమారాణి, మల్లేశ్వరి పాల్గొన్నారు.


