బెల్లంపల్లి నియోజకవర్గంలో.. | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి నియోజకవర్గంలో..

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

వేమనపల్లి మండలం కల్మలపేట యూపీఎస్‌లో నిధుల లేమితో ప్రహరీ, వంటగది, మరుగుదొడ్డి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. 52మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఒకే మరుగుదొడ్డి ఉంది. నల్లాలు విరిగిపోయాయి. క్రీడా మైదానంలో పిచ్చిమొక్కలు, ముల్లపొదలు పెరిగాయి. ప్రహరీ లేక పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామస్తులు పడేసే వ్యర్థాలు, చెత్తాచెదారంతో దుర్గంధం వ్యాపిస్తోంది.

తాండూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భోజనశాల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గోడలకు ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మండల ప్రజాపరిషత్‌ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం గురువారం ప్రారంభించారు. ఎప్పుడు పూర్తి చేస్తారో అధికారులకే తెలియాలి. కాపువాడలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వంటగది నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు. కత్తెర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటగది, మరుగుదొడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

నెన్నెల మండల కేంద్రంలోని జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. పాతవాటికి నీటి సౌకర్యం లేదు. జెండావెంకటాపూర్‌, పొట్యాల, గుండ్లసోమారం ప్రాథమిక పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తాండూర్‌: కాపువాడ ఎంపీపీఎస్‌లో

అసంపూర్తిగా ఉన్న వంట గది

వేమనపల్లి: అసంపూర్తిగా కల్మలపేట పాఠశాల మరుగుదొడ్లు, వంటశాల

బెల్లంపల్లి/వేమనపల్లి/తాండూర్‌/నెన్నెల: బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉర్ధూ మీడియం పాఠశాలలో వంటగది సరిగా లేదు. పైన రేకులు మాత్రమే అమర్చడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. కన్నాలబస్తీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది. రాంనగర్‌బస్తీలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement