ఆదిలాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్లో ఈనెల 14న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. మావల మండలంలోని కుమురం భీంగూడలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం వ్యూహాలు, ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెట్టి మనోజ్, రాష్ట్ర కార్యదర్శి అర్క శేషారావు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గేడం విష్ణు, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వేడామ ముకుందరావు, నాయకులు తొడసం ప్రకాశ్, కుమ్ర గోవింద్, గోడం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


