నిర్మల్ఖిల్లా: పట్టణంలోని గాజులపేట్ సమీప పంటపొలాల్లో గురువారం మధ్యయుగ కాలానికి చెందిన పురాతన యుద్ధవీరుని శిల్పం లభ్యమైనట్లు జిల్లాకు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్ తెలిపారు. సుమారు 12వ లేదా 14వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పం నాలుగు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉందని పేర్కొన్నారు. యోధుని రూపాన్ని అద్భుతంగా చెక్కినట్లు తెలిపారు. తలపై ముడిచిన కురులు, పెద్ద కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డోలు ధరించి ఉందన్నారు. శిల్పానికి ఎదురుగా సుమారు నాలుగు అడుగుల ఎత్తు గల రాతి దీపస్తంభం ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఇలాంటి వీరగళ్లు శిల్పాలు ఉన్నాయని, పురావస్తు శాఖ గుర్తించి అధ్యయనం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
నలుగురు ఎస్సైల బదిలీ
గోదావరిఖని: కాళేశ్వరం జోన్పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్కిశోర్ఝా ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ మంచిర్యాలలో పనిచేస్తున్న కె.నరేశ్ను ఎస్హెచ్వోగా పెద్దపల్లికి బదిలీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఎస్హెచ్వో ఎన్.మధూకర్ను సీసీఎస్ రామగుండం కమిషనరేట్కు బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్రావును సీసీఎస్ రామగుండం, ఇటీవలే పెద్దపల్లి ఎస్హెచ్వోగా బదిలీ అయిన బి.జీవన్ను సీసీఎస్ పెద్దపల్లికి బదిలీ చేశారు.


