లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో వంటగ్యాస్ అవసరమైన ప్రాంతాల్లో బయో గ్యాస్లైన్ వేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి సోమవారం పరిశీలించారు. అందులో భాగంగా రోగులు, డ్యూటీ వైద్యులకు ఆహారం సిద్ధం చేసే డైట్ క్యాంటీన్, వైద్య విద్యార్థుల యూజీ, పీజీ హాస్టల్స్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్లలో డైట్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలో బయోగ్యాస్ లైన్ ఉన్నందున, ఆస్పత్రిలో అవసరమైన ప్రాంతాలకు సరఫరా లైన్ వేసేందుకు పాయింట్లు గుర్తించారు. తొలుత ఆస్పత్రి, హాస్టల్స్కు బయోగ్యాస్ లైన్ వేసిన తర్వాత, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు హోటల్స్, కాఫీ స్టాల్స్కు కూడా సరఫరా చేసేందుకు ఆస్పత్రి అధికారులతో చర్చించారు. ఆమె వెంట అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) జె. లక్ష్మీకుమారి తదితరులు ఉన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే సమయంలో కనీసం అరగంట సమయం కేటాయించి ఒక వీధిని ఎంపిక చేసుకుని అక్కడ కనిపించే వ్యర్థాలను తొలగించేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, అధికారుల భాగస్వామ్యం తదితర అంశాలపై అధికారులకు వివరించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈగా పి. హరిబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పనిచేసిన రవీంద్రబాబు శనివారం ఉద్యోగవిరమణ చేశారు. ఈ స్థానంలో గుణదల ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం ఈఈగా పనిచేస్తున్న పి. హరిబాబును ఉద్యోగోన్నతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈగా నియమించింది. దీంతో ఆయన సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్లో కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్నారు.
తిరువూరు పీఎస్ ఎదుట బాలిక కుటుంబం ఆత్మహత్యాయత్నం
తిరువూరు: బాలికతో సచివాలయ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు స్పందించకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు సోమవారం తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కొమ్మిరెడ్డిపల్లిలోని సచివాలయ ఉద్యోగి బంకా మధు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గతనెల 17న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క సోమవారం రాత్రి తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను పోలీసులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు ఎస్ఐ శాతకర్ణి కేసు నమోదు చేయకుండా నిందితుడికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర సంగమం వద్ద 5వ తేదీ నుంచి ప్రారంభించే కృష్ణమ్మ హారతుల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్కు చేరుకున్న అధికారులు ఏర్పాట్ల గురించి చర్చించారు. సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన సామగ్రిని భద్రపరుచుకునేందుకు తగినన్ని ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.


