ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మూలపాడు(ఇబ్రహీంపట్నం): జలవనరుల సంరక్షణ రాబోయే తరాలకు నీటి భద్రత కల్పిస్తుందని, ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని మూలపాడు చెరువులో జరుగుతున్న జలధార పనులను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తాను కూడా పలుగు పారపట్టి చెరువు పనిలో భాగస్వామిగా మారి ఉపాధి శ్రామికులను ప్రోత్సహించారు. శ్రామికులతో కలిసి భోజనం చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చెరువుల అభివృద్ధికి చర్యలు..
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్ధికి దశల వారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. వీటి పూర్తిస్థాయి సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం వీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు మాత్రమే అన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న చెరువులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లాలో జలధార కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.87 కోట్లతో 1,300 పనులను గుర్తించామన్నారు. డ్వామా పీడీ ఎ.రాము, డీఎఫ్వో జి. సతీష్, ఎంపీడీవో డి.శకుంతల, ఏపీవో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.


