కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
హనుమాన్జంక్షన్ రూరల్: జౌళి పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, మోహన్ స్పిన్టెక్స్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు.
ఏపీలో విస్తృత అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్లో జౌళి పరిశ్రమ రంగంలో ఎదిగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్లు మేర ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించిందన్నారు. ఈ ప్రొత్సాహాకాల్లో ఏపీ అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ స్పిన్టెక్స్ పరిశ్రమ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అక్కడ ఉన్న పుంగనూరు ఆవులు, దూడలను పరిశీలించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి శివకుమార్, డైరెక్టర్ గిరీష, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీరబ్కుమార్, కేంద్ర జౌళి కార్పోరేషన్ గుంటూరు డివిజన్ డెప్యూటీ డైరెక్టర్ ధనశేఖరన్, చేనేత, జౌళి శాఖ ఏడీలు పాల్గొన్నారు.


