కృష్ణా జాయింట్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధి పొందేందుకు రేషన్కార్డులోని ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో మే 24వ తేదీ నాటికి 20,450 మంది ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉందన్నారు. పెండింగ్ జాబితాలు వీఆర్వో, సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైస్కార్డు కలిగి ఉండి ఇంకా ఈ–కేవైసీ చేయని లబ్ధిదారులు (ఐదేళ్లలోపు చిన్నారులు మినహా) వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, ఈ–పోస్ పరికరాల ద్వారా బయోమెట్రిక్ నమోదుచేసి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ఇటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సరుకులు సరఫరా చేయాలన్నారు. రేషన్ దుకాణాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.


