పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మైలవరం: ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఘటన మంగళవారం మైలవరం చండ్రగూడెం జాతీయ రహదారిపై జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం తిరువూరు డిపోకు చెందిన అర్టీసీ అద్దె బస్సు 40 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తోంది. చండ్రగూడెం బైపాస్ వద్దకు వచ్చే సరికి రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులో ఉన్న వారు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్సై సుధాకర్ తెలిపారు.


