బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం బెంగళూరు జయనగరలో వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ ఆ ఆరోపణలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇష్టానుసారం గ్యారంటీ పథకాలను అందించడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక వినాశనం జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకల సంచారానికి సమస్య ఉంది. అధిక డబ్బు చెల్లించే దేశాలకు చమురు సరఫరా అవుతోందని, నౌకలకు బీమా ఉన్నప్పటికీ యుద్ధకాలంలో ఉపయోగం లేదని ఆమె తెలిపారు. ఇన్ని సవాళ్లు నెలకొన్నా, దేశంలో ఎల్పీజీ గ్యాస్కు కొరత లేదని, రాహుల్గాంధీకి ఇది తెలియడంలేదని మండిపడ్డారు. భారత జీడీపీ 7.7 శాతానికి చేరడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు విజయేంద్ర, తేజస్వి సూర్య తదితరులు ఉన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్


