శివాజీనగర: రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3 కాంగ్రెస్కు, 1 బీజేపీకి దక్కాయి. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, మన్సూర్ అలీఖాన్, పవన్ ఖేరా, బీజేపీ నుంచి ఎం.నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులు పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విధానసౌధలో గురువారమే ఇద్దరు అభ్యర్థులకు విధానసభా కార్యదర్శి విశాలాక్షి ధృవీకరణ పత్రం అందజేశారు. శుక్రవారం మల్లికార్జున ఖర్గే స్వీకరిస్తారు. పవన్ ఖేరా మాట్లాడుతూ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కన్నడ సుందరమైన భాష, కన్నడ నేర్చుకొంటానని తెలిపారు.
రాఘవ మఠంలో పూజలు
బనశంకరి: నగరంలోని జయనగర ఐదోబ్లాక్లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశి సందర్భంగా గురువేంద్రస్వామికి అర్చకులు అలంకరణ, పూజలు చేపట్టారు. ప్రియాగణేశ్ బృందంచే భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
సముద్ర తీరంలో అలర్ట్
యశవంతపుర: సముద్ర తీరంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల సముద్ర తీరంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. టూరిస్టులు సురక్షతా చర్యలను పాటించాలని తెలిపారు. మంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రముఖ బీచ్లలో జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులు హై అలర్ట్ను ప్రకటించారు. నీటిపై తేలే వంతెనలు, బోటింగ్ లాంటి క్రీడలను బంద్ చేశారు.
9, 10 తరగతులకు
ఆర్టీఈపై స్టే
దొడ్డబళ్లాపురం: 9, 10వ తరగతులకు కూడా ఆర్టీఈని విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 9, 10వ తరగతుల్లో ఉచితంగా సీట్లు ఇవ్వాలని సర్కారు ఆదేశించడం సరికాదంటూ ప్రైవేటు పాఠశాలల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆర్టీఈ చట్టం పరిధిని దాటి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు.. కేసు పూర్తయ్యే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయరాదని ఆదేశించింది.


