శ్రీనివాసపురం: ఇచ్చిన అప్పు తిరిగి వాపసు ఇవ్వాలని అడిగి నందుకు మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన శ్రీనివాసపురం తాలూకా లక్ష్మీపుర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ (70) హత్యకు గురైన మహిళ. చింతామణికి చెందిన తిమ్మరాజు, మునిరాజు హంతకులు. గత నెల 17వ తేదీన ఘటన జరగగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరు అన్నదమ్ములు. వీరు రెడ్డెమ్మ వద్ద వడ్డీకి అప్పు తీసుకుని నెలనెల వడ్డీ కడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల వీరు వడ్డీ సరిగా కట్టకపోవడంతో ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని రెడ్డెమ్మ అడిగింది. నిందితులు ఇద్దరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేక రెడ్డెమ్మను కడతేర్చాలని ప్లాన్ వేశారు. డబ్బు వాపసు ఇస్తామని చెప్పి చింతామణిలోని తమ ఇంటికి రెడ్డెమ్మను పిలిపించుకున్నారు. రెడ్డెమ్మను నిందితులు ఇద్దరు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కెంచార్లహళ్లి వద్దకు తీసుకు వెళ్లి అక్కడ అటవీ ప్రాంతంలో పడేశారు. రెడ్డెమ్మ కనిపించకపోవడంలో కటుంబీకులు మే నెల 26వ తేదీన రాయల్పాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తిమ్మరాజు, మునిరాజును అరెస్టు చేశారు.


