రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఖరీఫ్లో ముందుగానే వానలు కురిశాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లలో నీటి పారుదల, మిగిలిన హెక్టార్లలో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంది. కేఎస్ఎంఎఫ్లో 7,393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నులు, 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మహ్మద్ హుసేన్ వెల్లడించారు. రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. మరో వైపు రైతులు ఎరువులు, క్రిమి సంహారక మందుల కోసం దుకాణాల ముందు బారులు తీరి నిలబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభం
ముందుగానే కురిసిన వానలు


