హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని డణాపుర వద్ద నిర్మించిన జాతీయ రహదారి–50లో సర్వీస్ రోడ్డు 8–10 రోజులకే దుస్థితికి చేరడంతో ఒక లోడ్ లారీ రోడ్డులోని గోతిలో చిక్కుకుపోయింది. నాసిరకంగా నిర్మించిన పనుల కారణంగా రోడ్డు కుంగిపోయింది. రెండు నెలల క్రితం బళ్లారి ఎంపీ ఈ.తుకారాం సర్వీస్ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన నిర్మించిన సర్వీస్ రోడ్డు దుస్థితిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. డణాపుర నుంచి మరియమ్మనహళ్లి వరకు ఉన్న ఈ రహదారిని మొత్తం రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించారు. మరియమ్మనహళ్లి వరకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డుపై జాతీయ రహదారి వెంట పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టు కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. నాణ్యమైన పనులు చేయకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ కంపెనీపై తగిన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులను డిమాండ్ చేశారు.


