బళ్లారిఅర్బన్: నగరంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను త్వరలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. మంగళవారం 14వ వార్డులో నిర్వహించిన సలాం బళ్లారి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడిగి చెన్నప్ప సర్కిల్, మహర్షి వాల్మీకి విగ్రహం, రహదారి పనులను ప్రజలకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. అలాగే రూ.270 కోట్ల శాశ్వత తాగునీటి పథకానికి భూమిపూజ నిర్వహిస్తామన్నారు. భారీ వర్షాల సమయంలో అధికారులు, జెస్కాం సిబ్బంది సమర్థంగా పని చేశారని ప్రశంసించారు. పాత విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పునకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ నూర్ మహమ్మద్, బీఆర్ఎల్ శీనా, మంజుల, పద్మ, థియేటర్ శివు, రాకీ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుకు నామకరణం
నగర అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖుల జ్ఞాపకార్థం రోడ్లకు పేరు పెట్టే కార్యక్రమంలో భాగంగా బళ్లారి మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఓ రోడ్డుకు ముండ్లూరు నరసింహప్ప రోడ్డుగా నామకరణం చేశారు. మంగళవారం నగరంలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి నామఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బళ్లారి నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన ముండ్లూరు నరసింహప్ప పేరిట రోడ్డుకు నామకరణం చేయడం గర్వకారణమన్నారు. ముండ్లూరు కుటుంబ సభ్యులు, మహానగర పాలికె కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి


