హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిలోని అమరదేవరహళ్లికి చెందిన ఓ యువకుడు చెట్టు పైనుంచి కిందపడి మరణించిన ఘటన జరిగింది. ఆకాష్(23) బెంగళూరు గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. శనివారం సాయంత్రం క్యాంపస్ ఆవరణలో పనస చెట్టు ఎక్కుతుండగా కిందపడ్డాడు. అతని తలకు తీవ్ర గాయమైంది. అతనిని సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతను ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. విద్యా, క్రీడా కార్యకలాపాల్లో మృతుడు చూపిన శ్రద్ధకు ఎన్ఎస్ఎస్ విభాగంలో ఉత్తమ వలంటీర్గా పురస్కారాన్ని అందుకున్నారు. మృతుడు 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించి, కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆకాష్ మరణంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి, మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై బెంగళూరులోని యలహంక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.


