రక్తదానానికి అర్హత
కోల్సిటీ(రామగుండం): కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తున్న ఈరోజుల్లో తామున్నామని రక్తదాతలు ముందుకు వస్తున్నారు. బాధితులతో సంబంధం లేకున్నా రక్తదానం చేసి రక్తసంబంధీకులవుతున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్ జయంతి సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తోంది.
సామాజిక మాధ్యమాలే వేదిక
అత్యవసర సమయంలో రక్తదానం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువకులు, సేవా సంస్థలు బృందాలుగా ఏర్పడ్డారు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదాతలను అనుసంధానిస్తూ అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. ఒక్కసందేశంతోనే రక్తదాతలు స్పందించి ప్రాణాలు కాపాడుతున్నారు.
300 మి.లీ. చొప్పున సేకరణ
ఒక్కో వ్యక్తి శరీరంలో సగటున ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. ఈ సమయంలో 300 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. సేకరించిన రక్తం కొన్నిగంటల్లోనే తిరిగి శరీరంలో ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది.
ఒక యూనిట్.. మూడు ప్రాణాలకు జీవం
రక్తంలో ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అనే మూడు భాగాలు ఉంటాయి. రక్తదానం చేసిన ఒక యూనిట్ రక్తాన్ని వివిధ భాగాలుగా విడదీసి అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. అందుకే ఒక్క రక్తదానం ద్వారా మూడు ప్రాణాలకు జీవం పోసే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
బరువు కనీసం 45 కిలోలు ఉండాలి
18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి
నిమిషానికి 60 నుంచి 100సార్లు నాడి కొట్టుకోవాలి
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12.5గ్రాములకు పైగా ఉండాలి
ఆరోగ్యంగా ఉండి, వైద్యుల సూచనల మేరకు రక్తదానం చేయాలి.
ఒకయూనిట్.. మూడు ప్రాణాలకు జీవం
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం


