టెహ్రాన్: ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశ నూతన సుప్రీం లీడర్, 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై, కోమాలోకి జారుకున్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మొజ్తబా.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన కోమ్ నగరంలో అత్యంత రహస్యంగా చికిత్స పొందుతున్నారని, దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని ‘ది టైమ్స్’ నివేదిక చెబుతోంది. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇరాన్ అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన డెడ్లైన్ విధించారు. అమెరికా ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. మంగళవారం రాత్రి 8 గంటల (EDT) లోపు ‘హార్ముజ్ జలసంధి’ని అంతర్జాతీయ నౌకల కోసం తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఈ గడువులోగా స్పందించకపోతే, ఇరాన్లోని కీలకమైన పవర్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలన్నింటినీ ఒకే రాత్రిలో నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాన్ని పెంచుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేస్తూ, ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇరాన్లోని ఒక ప్రధాన పెట్రోకెమికల్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయడమే కాకుండా, ఇరాన్ శక్తివంతమైన పారామిలిటరీ దళం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ ఇంటెలిజెన్స్ చీఫ్ను మట్టుబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమించడం, మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ వైపు నుండి దాడులు ముమ్మరం కావడంతో ఇరాన్ సైన్యం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని సమాచారం.
ఇది కూడా చదవండి: ‘ఐఐటీ బాబా’ మరో సెన్సేషన్ .. ‘ఎంత పని సేస్తివిరో..’


