హర్మూజ్ జలసంధిని దిగ్భందించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలపై తాజాగా ఇరాన్ స్పందించినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్కు చెందిన ఏ నౌకలైనా హర్మూజ్లోకి వస్తే అది సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని టెహ్రాన్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
ఇస్లామాబాద్లో అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలంతో చిర్రెత్తిపోయిన ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ మేరకు తక్షణమే హర్మూజ్ను దిగ్భందించాలని ఆ దేశ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాతరలను ధ్వంసం చేస్తామన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పందించినట్లు తెలుస్తోంది. అమెరికాకు సంబంధించిన ఏ మిలిటరీ నౌకలైనా హర్మూజ్ జలసంధి గుండా వెళ్తే అది కాల్పులు విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించినట్లే ఒకవేళ అలా జరిగితే ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటుంది అని పేర్కొంది.
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సైతం దీనిపై స్పందించారు. హర్మూజ్ దిగ్భందనంతో అమెరికా గ్యాసోలిన్ ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతుంది అని అన్నారు. "అమెరికా ప్రస్తుతం ఉన్న $4-$5 గ్యాసోలిన్ ధరలను అస్వాధించండి. మీరు త్వరలోనే ఈ ధరను కోల్పోతారు". అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు గత 47 ఏళ్ల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు. ఈ చర్చలకు ఇరాన్ మంచి దృక్పథంతో పాల్గొందని ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకునే నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు విచారకరమన్నారు. మంచి ఎప్పుడు మంచినే కలిగిస్తుందని అదే శత్రుత్వం ఎప్పుడూ శత్రుత్వాన్ని రగిలిస్తోందని అరాగ్చీ అన్నారు.
కాగా ఇటీవల ఇస్లామాబాద్లో ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదని అమెరికా కండీషన్లకు ఇరాన్ ఒప్పుకోలేదు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.


