16 నుంచి కార్యాచరణ డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణమే ప్రాణాధారమని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ప్రతి సంవత్సరం అతిసారం వల్ల ఐదు సంవత్సరాల పిల్లల్లో 4.3% మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. డయేరియా నివారణకు ముందస్తు గుర్తింపు, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రల వినియోగం ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చన్నారు.
అతిసార వ్యాధి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం స్టాప్ – డయేరియా క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. డయేరియా నివారణకు పరిశుభ్రత ఓఆర్ఎస్ పాకెట్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 15 వ తేదీ వరకు సన్నద్ధత దశ అని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 31 వ తేదీ వరకు కార్యాచరణ దశ అన్నారు. జూన్ 16 వ తేదీ నుంచి జరిగే కార్యాచరణ దశలో భాగంగా చంటి బిడ్డలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించుట, రోటా వైరస్ వ్యాక్సిన్ అందజేయుట, చేతుల పరిశుభ్రత, రక్షిత తాగునీరు అందజేయుట, ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్, జింకు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1,45,000 మంది ఐదేళ్లలోపు చంటిబిడ్డలకు అందజేయుటకు 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ టాబ్లెట్లు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.


