చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విజ్ఞాన్ ఆన్లైన్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక వార్షిక విద్యార్థుల సమావేశం ‘వాక్స్–2026’ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 180 మంది ఆన్లైన్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు హాజరై విద్య, విజయాలు, పరస్పర అనుబంధాలను వేడుకగా జరుపుకున్నారు. వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిశోర్ మాట్లాడుతూ ఆన్లైన్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వార్షిక సమావేశం ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై బ్యాచ్ల టాపర్లను సత్కరించారు. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


