గుంటూరు రూరల్: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్, ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ బోర్డు చైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని కోరారు.


