సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!
తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.
అందుకే ఈ మార్పులు!
ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.
తొలగించిన వారికి లభించే ప్రయోజనాలు
బాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది.
"ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.
2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


