ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో కొత్త సీఈఓను ప్రకటించింది. పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 'విలియం వాల్ష్' (Willie Walsh)ను నియమించింది.
విలియం వాల్ష్ ప్రస్తుతం IATA (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంతకంటే ముందు బ్రిటిష్ ఎయిర్వేస్, ఐఏజీ వంటి ప్రముఖ కంపెనీలలో సీఈఓగా పనిచేచినట్లు ఇండిగో వెల్లడించింది.
ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. విలియం వాల్ష్ ఒక అత్యుత్తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న విమానయాన రంగంలో ఇండిగోను మరింత బలోపేతం చేయడానికి ఆయన సరైన ఎంపిక అని చెప్పారు.
తన నియామకంపై విలియం వాల్ష్ మాట్లాడుతూ.. ఇండిగోను నడిపించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంస్థకు బలమైన పునాది, స్పష్టమైన లక్ష్యం, మంచి ప్రతిష్ట ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా.. సంస్థలోని ఉద్యోగుల కృషి, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు, సహకారం, స్థిరమైన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.


