ప్రపంచ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత పరంపర 2026లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో మరింత వేగం పుంజుకుంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ (Layoffs.fyi) సేకరించిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభ నెలల్లోనే సుమారు 73,200 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 దిగ్గజ టెక్ కంపెనీలు ఈ తొలగింపుల్లో భాగమయ్యాయి. కరోనా కాలంలో అవసరానికి మించి జరిగిన నియామకాలు, ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొలువుల కోతకు దారితీసిన కీలక అంశాలు
2021 నుంచి ఇప్పటివరకు టెక్ రంగంలో సుమారు పది లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుత సంక్షోభానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. కంపెనీలు తమ వ్యయాన్ని సాంప్రదాయ విభాగాల నుంచి ఏఐ, ఆటోమేషన్, మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి. మానవ వనరుల కంటే సాంకేతికతపై పెట్టుబడి పెట్టడమే లాభదాయకమని సంస్థలు భావిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, సాస్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఈ-కామర్స్ రంగం ఉంది. ఈ ప్రభావం అత్యధికంగా అమెరికాపై కనిపిస్తోంది. యూరప్, ఆసియా దేశాల్లోని సెమీకండక్టర్, టెలికాం, ఐటీ సేవల విభాగాల్లోనూ గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల కోత నమోదైంది.
ఏఐ భర్తీ చేస్తోందా?
సాధారణంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే భయం ఉన్నప్పటికీ నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది. ప్రస్తుతానికి ఏఐ నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే కంపెనీలు ముందస్తుగా ఖర్చులను తగ్గించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో నియామకాలు, తొలగింపుల నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టెక్ కంపెనీలు ఇప్పుడు ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఏఐ వంటి కొత్త వృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం పాత విభాగాల్లో కోతలు విధిస్తున్నాయి.
ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే ఈ ఏడాది ముగిసే సమయానికి ఉద్యోగ కోతలు మరిన్ని వేలల్లో ఉండవచ్చని డేటా సూచిస్తోంది. టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడమే ఈ సంక్షోభం నుంచి బయటపడే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!


