మాచర్ల మోహనరావుపై దాడిని ఖండించిన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు
జాండ్రపేటలో ర్యాలీ.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
మోహనరావుపై దాడికి పరోక్షంగా ఎమ్మెల్యే అండ ఉందని ఆరోపణ
ఆయనపై అట్రాసిటీ కేసును
తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్
చీరాల అర్బన్: చీరాలలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా గుర్తింపు పొందిన రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకుడు మాచర్ల మోహనరావుపై ఇటీవల సిధూర్ కాలనీలో జరిగిన దాడి అందుకు నిదర్శనమని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. సిధూర్ కాలనీలో భూ వివాదానికి సంబంధించి మోహనరావు, సుమతి అనే ఇరువురు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. మోహనరావుకు మద్దతుగా చీరాల మండలం జాండ్రపేటలోని కల్యాణ మండపంలో సోమవారం రాత్రి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోహనరావుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, మోహనరావుపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరును శంఖించారు. అందుకు పరోక్షంగా అధికార పార్టీయే కారణమని ఉద్ఘాటించారు. జాండ్రపేటలో రాస్తారోకో చేపట్టి మోహసరావుకు మద్దతుగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి జరిగే ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


