ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బాపట్ల చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి
బాపట్లటౌన్: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లోని పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. జీవీవీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పరిష్కారానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పలు క్యాడర్ల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్లో వివరించామన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సర్వీసు సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గతనెల 22న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1032ప్రకారం జూన్ 1 నుంచి 15 మధ్య ఒక తేదీ, సమయాన్ని నిర్ణయించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలన్నారు.
లిటరసీ న్యూమరసీ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శివలక్ష్మి
పర్చూరు(చినగంజాం): ప్రాథమిక తరగతుల్లో ఉపాధ్యాయులు నేర్పిన విద్య విద్యార్థికి జీవితాంతం ఉపయోగ పడుతుందని ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్, జ్ఞాన ప్రకాష్ 3 ఫౌండేషన్ లిట్రసీ న్యూమరసీ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ వి. శివలక్ష్మి అన్నారు. పర్చూరులో నిర్వహిస్తున్న లిటరసీ న్యూమరసీ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ.. 1, 2 తరగతులు పిల్లలకు అక్షరాలు, అంకెలు తప్పనిసరిగా నేర్పించాలని, ప్రాథమిక తరగతులలో నేర్పిన విద్య జీవితాంతం ఉపయోగ పడుతుందన్నారు. ఏఎంవో మోజస్ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ శిక్షణ అనేది అన్ని శిక్షణల మాదిరిగా కాదని, అన్నింటికన్నా మిన్న అని చెప్పారు. దీనిని అందరూ బాగా వినియోగించుకోవాలని పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో పర్చూరు ఎంఈవోలు ఎ. శివకోటేశ్వరరావు, పి. వెంకటరామయ్య, యద్దనపూడి ఎంఈవో పుల్లెల సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీఆర్పీలు, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


