పచ్చ దందా.. అధికారమే అండ తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు, పేకాట నిర్వహణ చీరాల అర్బన్: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు, అక్రమాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మితిమీరిన రాజకీయంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. నియోజకవర్గంలో తొలిసారిగా బరులు పెట్టి కోడిపందేలు ఆడించారు. కోత ముక్క నడిచింది. వేలం పాటలు పెట్టి మద్యం బెల్ట్ దుకాణాలు కేటాయించారు. ఇక రెండేళ్ల పాలనలో జరిగిన సహజ వనరుల దోపిడీ, రేషన్ మాఫియా బెదిరింపులు, భూ వివాదాలు.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద పుస్తకమే రాయవచ్చు. వీటన్నింటికీ యువనేత అండ, కీలక నేత ఆశీస్సులు కారణమని బహిరంగంగానే విమర్శలు ఉన్నాయి. ఏరియా వైద్యశాల రోడ్డులో చిన్న గుంతను రెండేళ్ల నుంచి పూడ్చలేక పోయారు. అక్కడ డ్రైయినేజీ, రోడ్డు నిర్మాణానికి సంబంధించి రెండేళ్ల పాలనకు ముందస్తుగా కొబ్బరికాయ కొట్టారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇదేనా చీరాల అభివృద్ధి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారిగా కోడి పందేలు
నియోజకవర్గంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో తొలిసారిగా సంక్రాంతికి బరులు పెట్టి కోడి పందేలు ఆడించారు. పందిళ్లపల్లిలోని ఓ మామిడి తోటలో కోత ముక్క ఆడించారు. అక్కడ రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు చేతులు మారాయి. అందుకుగాను రోజుకు కీలక నేత, యువనేతలకు రూ.2.50 లక్షలు నజరానాగా ముట్టాయి. ఇవి నియోజకవర్గానికి నేర్పిన కొత్త సంప్రదాయాలు. అంతిమంగా పోలీసు ఉన్నతాధికారులకు ఆకాశరామన్న ఫోన్ల సమాచారంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కోతముక్కను ఆపించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
రోజూ ఇసుక తవ్వకాలు, రవాణా..
చీరాల నియోజకవర్గంలో అధికారిక ఇసుక రీచ్ ఒక్కటి కూడా లేదు. కానీ ప్రతి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటాయి. అందుకుగాను పట్టా భూములతోపాటు, ప్రభుత్వ, అసైన్డ్, సొన పోరంబోకు భూముల్లో కూడా అక్రమార్కులు తవ్వకాలు సాగించటం పరాకాష్ట. అందుకు గాను ట్రాక్టరుకు రు.500 పచ్చనేతకు కప్పం కడుతున్నారు. వాటాలు పోను రూ.30లక్షలు మిగులుతాయని చెబుతున్నారు. అక్రమ ఇసుక దందా నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల మధ్య గొడవలు రేగాయి.
రిసార్టులు అప్పుడు అక్రమం
కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సముద్రం స్నానాలకు వెళ్లిన పలువురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఏకంగా రిసార్టులను మూయించారు. తరువాత పాలకులు, అధికారులు, రిసార్టుల నిర్వాహకుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో పలు నిబంధనలతో రిసార్టులను పునఃప్రారంభించారు. అయితే తరువాత సీఆర్జెడ్ నిబంధనలు ఎక్కడా అమలు లేదు. ఇదిలా ఉంటే తాజాగా గత ఐదు రోజుల వ్యవధిలో రామాపురం తీరంలో స్నానాలకు వెళ్లిన ఇద్దరు వేర్వేరు రోజుల్లో మృత్యువాత పడ్డారు.
పెరిగిన భూవివాదాలు
గత రెండేళ్ల కాలంలో భూవివాదాలు పెరిగాయి. రామాపురం, లక్ష్మీపురంలో జరిగిన ఘటనలను మననం చేసుకుంటున్నారు. ఇక అనధికారిక లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పలుచోట్ల కొన్న వారు తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంచర్ను బట్టి నజరానా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
వేలం పాటలు పెట్టి
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారారు. వారి పరిధిలో బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు పెట్టి బెల్ట్ దుకాణాలు కేటాయించటం పరాకాష్ట. దీంతో అవి విచ్చలవిడిగా నడుస్తున్నాయి. అందుకు తగ్గ ప్రతిఫలం పచ్చ నేతకు ముడుతోంది. ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
కౌన్సిల్ సమావేశాలెక్కడ?
మున్సిపల్ చైర్మన్గా టీడీపీ వ్యక్తి వచ్చాక సమావేశాలు కూడా సక్రమంగా జరపలేక పోయారు. రెండు నెలలు అసలు సమావేశాలే జరపలేదు. అది ప్రజాతీర్పును అపహాస్యం చేయటమేనని పుర ప్రజలు భావించారు. కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి, పైరవీకారులకు పెద్ద పీట వేస్తున్నారనే భావనకు కూటమి నేతలే వచ్చారు.
తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు, పేకాట నిర్వహణ
● యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా
● వేలం పాటలు పెట్టి మరీ
బెల్ట్ షాపుల కేటాయింపు
● రిసార్ట్స్ నిర్వహణలోనూ అక్రమాలు
● రామాపురం తీరంలో తాజాగా
మరో ఇరువురు మృతి
● పుట్టగొడుగుల్లా అనుమతులు
లేని లేఅవుట్లు
● కప్పం కట్టిన వారికి యువనేత అండ ..
కీలక నేత ఆశీస్సులు
డ్రైయిన్, రోడ్డు నిర్మించకుండా హెచ్చరిక బోర్డులు పెట్టిన దృశ్యం