వ్యవసాయశాఖ జిల్లా అధికారి లక్ష్మి
బాపట్ల: కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎ.లక్ష్మి పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం పరిధిలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే వరి రకాలను సాగు చేయడం ద్వారా ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటల అనువైన రకాలను ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి, సమతుల్య ఎరువుల యాజమాన్యం అనుసరించాలని సూచించారు. ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ బి.కృష్ణవేణి మాట్లాడుతూ నేల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. రైతు విత్తన ఉత్పత్తి దారులు సంఘాలుగా ఏర్పడి సామజిక మాధ్యమాలను ఉపయోగించుకొని వారు ఉత్పత్తి చేసిన వరి విత్తనాలను అవసరం ఉన్న రైతులకు సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో డాక్టర్ టి.కిరణ్కుమార్, డాక్టర్ కె.అచ్యుతరాజు, టి.హరిత, ఏడుకొండలు, వీరప్రసాద్ ఉన్నారు.


