‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’ | YSRCP Legal Cell President Manohar Reddy Demands Release Of Full Video | Sakshi
Sakshi News home page

‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’

Jun 23 2025 9:21 PM | Updated on Jun 23 2025 9:23 PM

YSRCP Legal Cell President Manohar Reddy Demands Release Of Full Video
  • ఆ సంఘ‌ట‌న‌కు ముందూ వెనుకా ఏం జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెలియాలి
  • వైఎస్సార్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి డిమాండ్
  • కార్లో ఉన్న వారంద‌రి మీదా కేసు పెట్టడం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం
  • ఏ ప్రాతిక‌దిక‌న కేసు న‌మోదు చేశారో పోలీసులు చెప్పాలి
  • రాజ‌కీయ క‌క్ష‌తో అక్ర‌మ కేసులు పెట్ట‌డం మానుకోవాలి 
  • న్యాయ‌స్థానాల తీర్పుల‌ను ఉల్లంఘించి పోలీసులు కేసులు పెడుతున్నారు
  • ఈ సాంప్ర‌దాయం స‌మాజానికి మంచిది కాదు

తాడేపల్లి:  న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి మరీ పోలీసులు కేసులు పెడుతున్నారని, ఈ సాంప్రదాయం మంచిది కాదని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటన సందర్శంగా చోటు చేసుకున్న సింగయ్య ఉదంతంపై పోలీసులు చెబుతున్న వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. ఆ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతోందని, ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు ప్రాతిప‌దిక‌గా తీసుకున్న వీడియోకి ముందు 5 నిమిషాలు, త‌ర్వాత 5 నిమిషాల వీడియోలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

‘వైఎస్‌ జ‌గ‌న్ వాహ‌నాన్ని న‌డిపింది కూడా ప్ర‌భుత్వం ఉద్యోగంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్. అనేక ఏళ్లుగా ఆయ‌న కార్లు న‌డ‌ప‌డంలో మంచి అనుభ‌వం ఉన్న వ్య‌క్తి. పోలీస్ విచార‌ణ‌లో త‌న కారు కింద వ్య‌క్తి ప‌డిపోయిన‌ట్టు కూడా తెలియ‌ద‌ని చెప్పాడు. ఒక‌వేళ నిజంగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని అనుకున్నా దానికి డ్రైవ‌ర్ పై బెయిల‌బుల్ సెక్ష‌న్ కింద కేసు పెట్టి నోటీసులివ్వాలి. కారులో ఉన్న‌వారంద‌రికీ తెలిసి కూడా నేరం చేసిన‌ట్టు పోలీసులు నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసు పెట్టారు. కారులో ఉన్న‌వారంద‌రి మీదా కేసు పెట్ట‌డం పూర్తిగా క‌క్ష‌పూరితం’ అని మనోహర్‌రెడ్డి తెలిపారు.

పోలీసులు స్క్రిప్టును ఎందుకు మార్చారు?
మొద‌టి రోజున టాటా స‌ఫారీ వాహ‌నం ఢీకొని చ‌నిపోయాడ‌ని చెప్పి దాన్ని సీజ్ చేసిన పోలీసులు, మూడు రోజుల త‌ర్వాత స్క్రిప్టును ఎందుకు మార్చారు?  డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేస్తే ర్యాష్ అండ్‌ నెగ్లిజ‌న్స్ డ్రైవింగ్ కింద న‌మోదు చేశార‌ని అనుకోవ‌చ్చు. విప‌రీత‌మైన క్రౌడ్ ఉన్న కార‌ణంగా అక్క‌డ ర్యాష్ డ్రైవింగ్ కి అవ‌కాశ‌మే లేదు. కాబ‌ట్టి డ్రైవ‌ర్ మీద కూడా కేసు పెట్టే అవ‌కాశం పోలీసుల‌కు లేదు. పైపెచ్చు   కారులో ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి స‌హా, ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌పై కేసు పెట్ట‌డం ముమ్మాటికీ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంది. 
జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కి ఆ మేర‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేదు. రోప్ పార్టీ, మాజీ సీఎం వాహ‌నానికి ముందుగా పైల‌ట్ వాహ‌నం, ఆయ‌న చుట్టూ పోలీసు భ‌ద్ర‌త వంటి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొటోకాల్ పాటించ‌లేదు. పోలీసులు నిర్ల‌క్ష్యం కార‌ణంగానే అభిమానులు ఆయ‌న కారుపైకి కూడా ఎక్కే ప‌రిస్ధితులు నెల‌కొంటున్నాయి.

చంద్ర‌బాబు మీద కేసులు పెట్ట‌లేదే? 
2015, 2016లో సంవ‌త్స‌రాల్లో చంద్ర‌బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌నిపోయారు. ఆ సంఘ‌ట‌న‌ల్లో చంద్ర‌బాబు మీద కేసులు పెట్టారా? గోదావ‌రి పుష్క‌రాల్లో చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ పిచ్చి కార‌ణంగా 29 మంది అమాయ‌క భ‌క్తులు చ‌నిపోయినా ఆయ‌న మీద కేసు పెట్ట‌లేదు. అదేవిధంగా 2022 డిసెంబ‌ర్‌లో చంద్ర‌బాబు నిర్వ‌హించిన కందుకూరు స‌భ‌లో 8 మంది చ‌నిపోయినా దానికి చంద్ర‌బాబుని బాధ్యుడ్ని చేసి ఆనాటి వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేసు పెట్ట‌లేదు. 2023 జ‌న‌వ‌రిలో గుంటూరులో చంద్ర‌బాబు నిర్వ‌హించిన మ‌రో తెలుగుదేశం స‌మావేశంలో ముగ్గురు చ‌నిపోయారు. ఆరోజు కూడా వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా చంద్ర‌బాబు మీద క‌క్ష‌పూరితంగా కేసులు న‌మోదు చేయ‌లేదు. కానీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్, ఇత‌రవైఎస్సార్‌సీపీ నాయ‌కుల మీద క‌క్ష‌పూరితంగా నేటి కూట‌మి ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేసింది. 

డ్రైవ‌ర్ యాక్సిడెంట్ చేస్తే అందులో ప్ర‌యాణించే వారి మీద కేసు పెట్టిన చ‌రిత్ర ఎక్క‌డైనా ఉందా అని ప‌రిశీలిస్తే దేశ చ‌రిత్ర‌లో ఒక్క కేసు కూడా క‌న‌ప‌డ‌లేదు. అంటే, రాజ‌కీయ క‌క్ష‌లు తీర్చుకోవ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం కొత్త అధ్యాయాల‌కు తెర‌తీస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్ర‌మ కేసులు పెట్టివైఎస్సార్‌సీపీ నాయ‌కుల‌ను వేధించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కూట‌మి నాయ‌కుల ఒత్తిడికి త‌ట్టుకోలేక కొంత‌మంది పోలీసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికొచ్చింది. ఇలాంటి విధానం రాష్ట్రానికి మంచిది కాదు. భ‌విష్య‌త్తులో అధికారంలోకి వ‌చ్చే పార్టీలు ఇదే సాంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తే వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేయ‌డంలో ఇదొక భాగం అవుతుంది. వ్య‌వ‌స్థ‌ల‌ను చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ఈ ప్ర‌భుత్వంపై ఉంద‌ని గుర్తుంచుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement